హైదరాబాద్, జులై 6తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర నివేదికపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందివంచిన సమగ్ర నివేదికపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
శనివారం గాంధీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ప్రజల వ్యక్తిగత సమాచారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
‘రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి చరిత్ర మా వద్ద ఉంది. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ)తో కూడిన ప్రత్యేక ఆల్గారిథమ్ను మేము అభివృద్ధి చేశాం. దీని ద్వారా పౌరుల ప్రతి సమాచారం దాదాపు 96, 97 శాతం కచ్చితత్వంతో తెలుసుకోగలం. మీరు ఎవరిదైనా ఒకరి పేరు నాకు చెప్పండి.. నేను వెంటనే వారి డిజిటల్ ఫుట్ ప్రింట్’ చెప్పగలను’ అని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఐటీసీ) శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో జరిగిన ‘డిజిటల్ అకౌంటింగ్’ అనే అంశంపై సైబర్ కన్వెన్షన్లో జరిగిన జాతీయ సదస్సు శుక్రవారం ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజల అనుమతి లేకుండానే ప్రభుత్వం ఎలాంటి వివరాల్ని సేకరించిందో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని గట్టిగా నొక్కి చెప్పారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించడానికి ఎవరి అనుమతి తీసుకున్నారో, ఏ చట్ట ప్రకారం గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని అధికారికంగా వినియోగిస్తున్నారో తెలియజేయాలని డాక్టర్ దాసోజు శ్రవణ్ పట్టుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమాచారం చోరీ చేసిందని చెప్పి ఇటీవల ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని డాక్టర్ శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని చెప్పారు. ఇప్పుడే అదే విధంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెడతారా అని నిలదీశారు. ‘మీ అందరి సమాచారం నా దగ్గర ఉందని చెప్పడం కచ్చితంగా బ్లాక్మెయిల్ చేయడమే. పౌరుల అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచార సేకరణ చేయడం పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన. విశ్వసనీయతపై వేటు వేయడమే. వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తుంటారు. దానిని ఆయా పనులు అయ్యే వరకూ వినియోగించాలి. కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వివరాల్ని క్రోడీకరించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగానికి తెర తీసింది. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని ఈ విధంగా క్రోడీకరించడం చట్టాన్నే కాకుండా రాజ్యాంగాన్ని కూడా తంగులోకి తొక్కేశారు..’ అని డాక్టర్ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వంటి వివిధ మార్గాల వ్వారా గూఢచర్యానికి పాల్పడి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రైవైటు వ్యక్తులకు వెళ్లలేదనే గ్యారెంటీ ఏమిటని నిలదీశారు. ‘డిజిటల్ ఫుట్ ప్రింట్’ అంటే ఆన్లైన్లో పౌరుల ప్రతి కదలికపై నిఘా ఉంచడమే. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఏ క్షణంలో ఎవరికి ఎలాంటి మెసేజ్ పంపించారో తెలుసుకోవడంతో పాటు ఇంటర్నెట్లో ప్రతి కదలికను తెలుసుకోవడమే. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్ను అన్ని పథకాలకు వర్తించకూడదని సుప్రీంకోర్టే ఆదేశించింది. ఆఖరికి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుంధానం చేయాలన్న ప్రయత్నాల్ని కూడా సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు పలు మార్గదరకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి పౌరుడి సమాచారం క్షణాల్లో చెప్పేయగలనని జయేశ్ రంజన్ వెల్లడించడం విస్మయానికి గురిచేస్తోంది.. అని శ్రవణ్ విమర్శల దాడి చేశారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు 2019 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిందని, దీనిని రాష్ట్రంలో బట్టి 25 ప్రభుత్వ శాఖల్లో వ్యక్తిగత వివరాల్ని లింక్ చేశారు. ప్రతి వ్యక్తి పేరు, చిరునామాల ఆధారంగా ఏడు కేటగిరీల సమాచారాన్ని క్రోడీకరించారు. నేరాలు, ఆస్తులు, వినియోగం, సబ్సిడీలు, విద్య, పన్నులు వంటి ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించారు. దాని తర్వాత భర్త, బంధువులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు ఇతరుల సమాచారాన్ని కూడా లింక్ చేశారు. ఈ సమాచారాన్ని ఎవరిని అడిగి క్రోడీకరించారో ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. దీనిపై తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు చేరవేశారో లేదో కూడా తేల్చాలి. వివిధ వివరాల్ని క్రోడీకరించిన ప్రైవేట్ ఏజెన్సీ ఏదో కూడా బహిర్గతం చేయాలి.. అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ఏవిధంగా సేకరించిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఈ సమాచారాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ నిర్వాకంపై ప్రభుత్వం కేసు పెడుతుందో లేదో చెప్పాలి.. అని నిలదీశారు. ప్రజల డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా.. ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఇదంతా చేశారని, ఈ వివరాలన్నీ గోప్యంగా ఉన్నాయో లేదో తేల్చాలని, గోప్యత కోసం జవాబుదారీతనం ఉందో లేదో కూడా తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పట్టుబట్టారు. అధికార పార్టీ వాణిజ్య అవసరాల కోసం గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదని గ్యారెంటీ ఏమిటని డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డికి వినతిపత్రం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
No comments:
Post a Comment