కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రతిష్ట దెబ్బతినేలా టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్
హైదరాబాద్, ఏప్రిల్ 10:చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా లేనిపోని పుకార్లు వ్యాప్తి చేయిస్తోందని, ఒక వర్గం మీడియా ద్వారా టీఆర్ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారం చేయిస్తోందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కొండా విశ్వేశ్వర్రెడ్డికి వ్యతిరేక ప్రచారం, పుకార్లు షికార్లు చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కొండా విశ్వేశ్వర్రెడ్డి, జి.నిరంజన్, ఎం.కోదండ రెడ్డిలతో కలిసి దాసోజు శ్రవణ్ బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిపత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఒక వర్గం మీడియా తప్పుడు వార్తలు ప్రచారంలో పెడుతున్నాయని, విశ్వేశ్వర్రెడ్డికి చెందిన డబ్బు పెద్ద ఎత్తున సీజ్ చేసినట్లుగా అసత్య వార్తల్ని ప్రచారంలో పెట్టాయని డాక్టర్ దాసోజు శ్రవణ్ చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా ఫలానా అధికారి చెప్పినట్లుగా కాకుండా డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లుగా కొన్ని టీఆర్ఎస్ అనుకూల చానల్స్ వార్తల్ని ప్రసారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ఆదేశాలు, అధికారపార్టీకి కొమ్ముకాసే కొంతమంది పోలీసులు అందుకు ఊతమిస్తున్నారని, ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు పట్టుబడినట్లుగా వార్తలు ప్రచారంలో పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారిని కోరుతూ వినతిపత్రం ఇచ్చామని డాక్టర్ దాసోజు శ్రవణ్ చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల ఆదేశాలు, కొద్దిమంది పోలీసు అధికారుల సమాచారం మేరకు కొన్ని చానల్స్కు, మీడియాకు తప్పుడు వార్తల సమాచారాన్ని అందజేస్తున్నాయని, కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్, కుటుంబ ప్రతిష్ట నేపధ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను టీఆర్ఎస్ ఢీకొనడం కష్టమని భయపడే భారీ మొత్తంలో ఏకంగా రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టారని ఆయన నిప్పులు చెరిగారు. ఇలాంటి కథనాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డాక్టర్ శ్రవణ్ డిమాండ్ చేశారు.
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కోట్లాది రూపాయలు తనకు చెందినవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణమైన అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల చర్యల్ని, తప్పుడు వార్తల్ని ప్రసారం చేసిన మీడియా తీరుపై కొండా విశ్వేశ్వర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారిని వినతిపత్రం ద్వారా కోరినట్లు తెలిపారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలకు కారణమైన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు. తాను పరువు నష్టం దావా వేసేలోగా, ఎన్నికల పోలింగ్ జరిగేలోగా ఇలాంటి అసత్య తప్పుడు వార్తలు ప్రసారం లేదా ప్రచురణ కాకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వార్తల్లో పేర్కొన్న పేరు గల వ్యక్తి గురించి కొండా విశ్వేశ్వర్రెడ్డి వివరణ ఇస్తూ.. పేటెంట్ ఇతర లీగల్ కేసుల్లో కలిసి పనిచేశామని, అతనేమీ తనకు బంధువు కాదని చెప్పారు. ఒక వివాహం నిమిత్తం ఒక మాల్లో భార్య పిల్లలతో ఆ వ్యక్తి వెళ్లారని, వారి వద్ద పది లక్షల రూపాయల లోపు నగదు ఉందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వివరాలు, ఆధారాలు చూపారని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు.
అధికార టీఆర్ఎస్ ఓటమి భయంతో నీచాతినీచంగా దిగజారిపోయిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు వార్తలను సైతం ప్రచారంలో పెట్టిందని డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. తప్పుడు మార్గంలో వెడుతున్న టీఆర్ఎస్ను ప్రజలు చిత్తుగా ఓడించి లోక్సభ సీట్లన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment