హైదరాబాద్, మార్చి 26 : పేదలకు కనీస ఆదయం చేకూరేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ‘న్యూనతమ్ ఆయోజన ( న్యాయ్ ) పథకం దేశం నుంచి పేదరికాన్ని తరిమికొట్టడానికి ఒక తిరుగులేని ` మాస్టర్ స్ట్రోక్ `వంటిదని అఖిల భారత కాంగ్రస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అభివర్ణించారు. ఏటా 72 వేల రూపాయల ఆదాయం కల్పించడం ద్వారా దేశంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలలో 20 శాతం కుటుంబాలను ఒకే ఒక దెబ్బతో పైకి తీసుకువచ్చేందుకుఈ రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఈ పథకం ఉపయోగపడుతుందని డాక్టర్ శ్రవణ్ మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త పథకం ద్వారా మొత్తం మొత్తం ఐదు కోట్ల కుటుంబాలకు, 25 కోట్ల మందికి వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరగలదన్నారు. తెలంగాణలోని 3.5 కోట్ల కుటుంబాలలో 2.75 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నబిపిఎల్ కేటగిరికి కిందకు వస్తారని, తద్వారా ఏభై లక్షల మంది నిరుపేదలకు లబ్ది కలుగుతుందని వివరించారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టిన పక్షంలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రవణ్ పేర్కొన్నారు.
దేశంలో పేదరిక నిర్మూలన కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి వినూత్న పథకానికి రూపకల్పన చేయడం జరుగుతోందని అన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పద్ధతి అనుసరించడం లేదన్నారు. ఇటువంటి పథకం బిజెపి నేతలకు మింగుడుపడటం లేదని , ఈ పథకాన్ని విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు. పలు అంశాలను నిశితంగా పరిశీలించి పరిశోధించిన అనంతరం ఇటువంటి పథకానికి రాహుల్ గాంధీ రూపకల్పన చేశారని, ఆర్ధిక సామాజిక అంశాలను పరిశీలించిన మీదట` న్యాయ్ ` పథకానికి స్పష్టమైన రూపం ఇచ్చారని, ఇటువంటి విప్లవాత్మక పథకం రుచించకపోవడం బిజెపి నేతలకు కొత్తేమీ కాదని, గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభం సందర్భంగా కూడా బిజెపి నాయకులు ఇటువంటి పద్ధతిలోనే స్పందించారని డాక్టర్ శ్రవణ్ గుర్తు చేశారు. పేదప్రజల ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఉపయోగపడే ఈ పథకం రానున్న దృష్ట్యా ప్రజలు రానున్న లోక్ సభ ఎన్నికలలో విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకోగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుకోట్ల మందికి ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాలలో 15 లక్షల నగదు జమ వంటి మోసపూరిత వాగ్దానాలు చేసిన ప్రధాని నరేంద్రమోదీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, పేద ప్రజల అభ్యున్నతికి దోహదపడే పథకాలతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజలు మొగ్గు చూపుతూ మార్పు దిశగా పయనిస్తున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
కేంద్రంలోని గత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ వంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోట్లాది మంది పేదలకు మేలు జరిగేలా విప్లవాత్మకమైన అనేక పథకాల్ని ప్రవేశపెట్టిందని శ్రవణ్ గుర్తు చేశారు. అదే విధంగా ఎన్వైఏవై పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించడం హర్షణీయమని, ఈ పథకం కూడా అమల్లోకి తీసుకువస్తే దారిద్రరేఖకు దిగుననున్న వారి జీవితాల్లో వెలుగు నిండుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు ప్రధాని మోదీ రెండు కోట్ల ఉద్యోగ కల్పన చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూట అయిందని, నిరుద్యోగుల్ని మోసం చేశారని శ్రవణ్ నిప్పులు చెరిగారు. ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పి ప్రజల్ని దగా చేసిందని విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసేలా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడమే కాకుండా గబ్బర్సింగ్ట్యాక్స్ (జీఎస్టీ) అమలు చేసి అన్ని వర్గాలపై పెనుభారం మోపడమే కాకుండా ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని శ్రవణ్ నిప్పులు చెరిగారు. దేశంలోని కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజల డబ్బును దోచుకుని మోదీ ప్రభుత్వం తన స్నేహితులైన 15 మంది పరమకుబేరులైన వారికి పంచిపెట్టారని ఆరోపించారు. నీరబ్ మోదీ, మహెల్ చౌక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా లాంటి పదిహేను మంది ధనవంతులు దేశ సంపదను దోచుకునేలా చేశారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రాభవం త్వరలోనే ముగుస్తుందని శ్రవణ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేయడం వల్ల, ఇతర విధాలుగా చేసిన మేనేజ్మెంట్ల కారణంగా సీఎం కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. తాజాగా ఇప్పుడు జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడాన్ని శ్రవణ్ స్వాగతించారు. ఈ ఓటమి ద్వారా టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు,మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సీటులో విజయ దుందుభి మోగించారని శ్రవణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా వరంగల్, ఖమ్మం,నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిందన్నారు. ఈ ఫలితాలను చూస్తుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగాఘన విజయం సాధిస్తుందని శ్రవణ్ ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి ప్రధానంగా హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనేనని శ్రవణ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరంలోగానీ, రాష్ట్రంలోగానీ ఎలాంటి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. అయితే గత కాంగ్రెస్ పాలనలో జరిగిన పనులను పూర్తి చేసి వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని అన్నీ తామే చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని శ్రవణ్ దుయ్యబట్టారు.
No comments:
Post a Comment