Sunday 19 January 2020

నోట్లకు సీట్లు అమ్ముకుంటున్న మంత్రి మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలి - దాసోజు శ్రవణ్ డిమాండ్

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన మంత్రులు మల్లా రెడ్డి, దయాకర్ రావులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు.


అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయం అంటే పచ్చి పెట్టుబడి వ్యాపారంగా టిఆర్ఎస్ నాయకులు మార్చేశారని ధ్వజమెత్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఏ మాత్రం ఇంగితం లేకుండా ఇవ్వాళ నోట్లు వుంటే సీట్లు ఇస్తామని, నోట్లు పెట్టి ఓట్లు వేయించు కుంటామనే దుర్మార్గమైన సంస్కృతికి నాయకులు శ్రీకారం చుట్టారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రెండు రోజుల కిందట టిఆర్ఎస్ కు చెందిన మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి , భద్రారెడ్డి అనే వ్యక్తితో కలిసి బొమ్మాకు మురళితో సీట్ కోసం 50 లక్షలు ఇవ్వాలంటూ బేరాలాడిన ఆడియో టేపులన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని దాసోజు వెల్లడించారు. నోట్లతో ఓట్లు కొనుక్కునే సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఘనత టిఆర్ఎస్ పార్టీదేనన్నారు. టికెట్ ఇచ్చే విషయంలో మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో ను మీడియా సాక్షిగా దాసోజు వినిపించారు.

అలాగే మీరు ఓట్లు ఎవరికి వేస్తారో తెలుస్తుందంటూ ఓటర్లను బెదిరిస్తూ ,  బ్లాక్ మెయిల్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అక్రమాలకు పాల్పడకుండా, డబ్బులు పంచకుండా, మద్యం సరఫరా చేయకుండా టిఆర్ఎస్ గెలిచే పరిస్థితిలో లేదన్న సంగతి మల్లారెడ్డి వ్యవహారంతో బట్టబయలైందన్నారు. ఇది ఎన్నికల అవినీతి కాదా, ఇది రాజకీయ అవినీతి కాదా అని ప్రశ్నిస్తున్నామని అన్నారు.

అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బేషరతుగా విచారణ జరిపించాలని, కేసు నమోదు చేయాలని అన్నారు. మోసాలకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

నోట్లకు సీట్లు అమ్ముకుంటున్న , నీతి మాలిన రాజకీయాలు చేస్తున్న మల్లా రెడ్డి పై , దయాకర్ రావుల పై  ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. వీరికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ టిఆర్ఎస్ పార్టీ సొత్తు గా కాకుండా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా నిష్పక్షపాతంగా పనిచేయాలి. సీట్లు అమ్ముకుంటున్న  మల్లారెడ్డి పై ఓటర్లను మీరు ఓటు ఎటు వేస్తారో మాకు తెలుసు అని బెదిరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

సీట్లు ఇవ్వడానికి ఒక్కో టికెట్ కు 50 లక్షల నుంచి కోటి దాకా వసూలు చేస్తున్నట్లు మల్లారెడ్డి ఆడియో టేపుల ద్వారా వెల్లడైందన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేయాలని, సుమోటోగా పోలీసులు, ఏసీబీ విచారణకు స్వీకరించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎసిబి, పోలీసులకు, ఎన్నికల కమిషన్ కు కేసు ఫైల్ చేస్తామన్నారు.

చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అవినీతికి పాల్పడితే ఉద్యోగులను జైళ్లకు పంపిస్తున్న ప్రభుత్వం మరి తన మంత్రివర్గంలో ఉన్న మంత్రి డబ్బులు వసూళ్లకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అవినీతి ఆరోపణలు వస్తే తన స్వంత కొడుకునైనా ఉపేక్షించనన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ ప్రశ్నించారు. గతంలో మంత్రి పదవి కోసం మల్లారెడ్డి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులపై ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చర్యలు తీసుకోవాలని దాసోజు  శ్రవణ్ డిమాండ్ చేశారు.




No comments:

Post a Comment