టీఆర్ఎస్,బీజేపీలు రాజకీయ పరాన్న జీవులుః అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు
హైదరాబాద్, మార్చి 22: టీఆర్ఎస్,బీజేపీలు రాజకీయ పరాన్న జీవులని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు వ్యాఖ్యానించారు. తమ స్వీయ అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. చేవెళ్లపార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి బలమైన నేతలు లేరని అదే సమయంలో ప్రజల మద్దతు సైతం టీఆర్ఎస్ పార్టీకి లేదని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ కారణం వల్లే బలంగా ఉన్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి జలగల వలేఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేందుకే వందల కోట్లు వెదజల్లి ఇతర పార్టీల నేతలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన నామానాగేశ్వరరావు ఉదంతాన్ని శ్రవణ్ ప్రస్తావిస్తూ, పార్టీలో చేరిన ఆరుగంటల వ్యవధిలో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన బోర్లకుంట వెంకటేశ్ నేతకు సైతం ఇదేరీతిలో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ కేటాయించారని ప్రస్తావించారు. తెలగాణలో బలపడేందుకు బీజేపీ సైతం ఇదే రీతిలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ పరాన్నజీవులుగా వ్యవహరిస్తున్నాయనిఎద్దేవా చేశారు.
ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సహా ఆరుగురు నేతలకు టికెట్లు ఇవ్వకపపోవడం ద్వారా వారి పనితీరు బాగా లేదని సీఎం కేసీఆర్ ధ్రువీకరించారని శ్రవణ్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ సహా అనేక అవకతవకలకు పాల్పడిగెలుపొందిందని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య పోటీ అని పేర్కొంటూ కేసీఆర్ ఈ పోరులో ప్రస్తావనలో కూడా లేని వ్యక్తి అని వెల్లడించారు. నియంత పాలన కావాలోప్రజాస్వామ్యయుత ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని శ్రవణ్ కోరారు. బీజేపీకి `బీ`టీంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏజెంట్ అయిన కేసీఆర్ ను రాబోయే ఎన్నికల్లో పూర్తిగా ఓడించాలని శ్రవణ్ కోరారు.
టీఆర్ఎస్ అభ్యర్థుల గురించి ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమద్రోహులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ``తెలంగాణ ఉద్యమంలో మల్లారెడ్డికి పాత్ర ఏంటి? కేసీఆర్ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు తాజాగాఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇదే రీతిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించారు. ఆయన బహిరంగంగానే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. క్యాబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవిదక్కింది. తాజాగా ఆయన కుమారుడికి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ కేటాయించారు. తెలంగాణ ఉద్యమానికి ఇలా బహిరంగంగా ద్రోహం చేసిన వారికి ఓటు వేయండి అని కేసీఆర్ కోరుతున్నారా?`` అని సూటిగా ప్రశ్నించారు.
జి.వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్ మరియు జితేందర్ రెడ్డి వంటి క్రియాశీల తెలంగాణ ఉద్యమకారులకు మొండిచేయి చూపించారని శ్రవణ్ పేర్కొన్నారు. ``తెలంగాణ ఉద్యమద్రోహులకు పదవులు…తెలంగాణవాదులకు మొండిచెయ్యిచూపడమే బహుశా టీఆర్ఎస్ విధానం కావచ్చు ``అని ఎద్దేవా చేశారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని శ్రవణ్ పేర్కొన్నారు. అనంతరం 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ లో చేరిన కొండా విశ్వేశ్వరర్ రెడ్డి చేవెళ్ల నుంచి గెలుపొందారని తెలిపారు. అయితే, అధికారం కంటే ఆత్మగౌరవంముఖ్యమని భావించి ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి జాతీయపార్టీతోనే సాధ్యమని ఆయన విశ్వసిస్తున్నారని శ్రవణ్ వెల్లడించారు. `కొండా` కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి కొండా వెంకట రంగారెడ్డిమరియు కొండా మాధవరెడ్డి వారసత్వంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గొప్ప వారసత్వం నుంచి వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి ఏ సందర్భంలోనూ అహంభావంతో వ్యవహరించలేదని, చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆమోదం పొందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్్మెంట్ రీజియన్ (ITIR)ని సాధించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని శ్రవణ్ ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గంలో కేవలం 8% మందిమాత్రమే ఉద్యోగులు ఉన్నారని, ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఈ ప్రాంతంలోని వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొక్కేవని వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రధానంగా చేవెళ్ల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీతీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. చేవెళ్ల నియోజకవర్గాన్ని మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ బూటకపు హామీలు ఇస్తున్నారని చెప్పారు. 111 జీవో ఉపసంహరించేందుకు కేసీఆర్ ఎలాంటినిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను, హామీల అమలులో సీఎం కేసీఆర్ వైఫల్యాన్ని ప్రజలు గమనించాలని శ్రవణ్ కోరారు. ``కేసీఆర్ ఇప్పటికీ ప్రజల అభివృద్ధిపై శ్రద్ధపెట్టడం లేదు. 16 సీట్లు గెలవాలని…అవకాశం దొరికితే ప్రధానమంత్రి అవడం లేదా ఢిల్లీలో కీలక పాత్రపోషించడం అనే దానిపైనే ఆయన దృష్టంతా ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తోంది`` అని వెల్లడించారు.
ఈ సందర్భంగా తనకు చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు మూడు లక్షలకు పైగా ఓట్లతో తాను ఈ నియోజకవర్గం నుంచిగెలుపొందనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment